ట్వంటీ-20 ప్రపంచకప్ టైటిల్ గెలుచుకున్న పాక్.. కొండంత ఆత్మవిశ్వాసంతో శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది. శ్రీలంకలో సుమారు 45 రోజుల పాటు పర్యటించనున్న పాక్ జట్టుతో పాటు కోచ్ ఇంతిఖాద్ ఆలమ్ కూడా ఆటగాళ్లతో కలిసి బయలుదేరి వెళ్లారు.
రెండు వేర్వేరు బ్యాచ్లుగా కరాచీ మరియు లాహోర్ల నుండి పాక్ ఆటగాళ్లు దుబాయ్ మార్గం గుండా కొలంబోకు చేరుకుంటారు. తొలుత జూన్ 29 నుండి ప్రారంభం కానున్న మూడు రోజుల ప్రాక్టీసు మ్యాచ్లో పాక్ పాల్గొంటుంది.
ఈ పర్యటనకు బయలుదేరి వెళుతున్న సందర్భంగా ఇంతిఖాబ్ విలేకరులతో మాట్లాడుతూ, బ్యాట్స్మెన్లు చక్కటి ప్రదర్శన కనబరచగలిగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అయితే ఆటగాళ్లలో ఫిట్నెస్ అత్యంత కీలకమైనదని.. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఆటగాళ్లదేనన్నారు.
లంకలో సాధారణంగా వేడిమితో కూడిన వాతావరణం ఉంటుందని.. కనుక తమ జట్టు ఆ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసి రావడం ఒక సవాలు లాంటిదని తెలిపారు. ఏదేమయినప్పటికీ, తమ ఆటగాళ్లు పూర్తి స్థాయిలో రాణిస్తారని.. ఈ సిరీస్లో చక్కటి ప్రదర్శనను తాను ఆటగాళ్ల నుండి రాబట్టగలనని వివరించారు.
వివాదస్పద బౌలర్ షోయబ్ అక్తర్పై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. అక్తర్ తన ఫిట్నెస్పై దృష్టి పెట్టగలిగితే తిరిగి జాతీయ జట్టులోకి రాగలడని సమాధానమిచ్చారు. కాగా, ఈ సిరీస్లో పాక్ జట్టే ఫేవరేట్ అని సీనియర్ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ ధీమా వ్యక్తం చేశాడు.
అదలా ఉంచితే.. ఈ పర్యటనలో పాక్ మొత్తం మూడు టెస్ట్ మ్యాచ్లు, 5 వన్డే మ్యాచ్లు, ఒక ట్వంటీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. 2007లో భారత పర్యటనకు వచ్చిన తర్వాత ఆ తరహా సుదీర్ఘ పర్యటనలో పాక్ పాల్గొంటుండటం ఇదే తొలిసారి. |