వెస్టిండీస్ పేస్ బౌలర్ రవి రామ్పాల్ బౌలింగ్ అద్భుతంగా ఉందని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసించాడు. రెండో వన్డేలో టీం ఇండియా బ్యాట్స్మెన్ను రామ్పాల్ ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో కీలమైన నాలుగు వికెట్లు పడగొట్టి రామ్పాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కించుకున్నాడు.
రెండో వన్డేలో వెస్టిండీస్ విజయంతో నాలుగు వన్డే సిరీస్ 1-1తో సమం అయింది. ఈ నేపథ్యంలో ధోనీ మాట్లాడుతూ.. రామ్పాల్ బౌలింగ్ అద్భుతమని పొగిడాడు. కళ్లు చెదిరే బంతులతో రామ్పాల్ విజృంభిస్తున్నానడని, రాబోయే రోజుల్లో అతను మంచి బౌలర్గా ఎదగడం ఖాయమని ధోనీ అభిప్రాయపడ్డాడు.
రెండో వన్డేలో అతని బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే తాము ఆత్మరక్షణలో పడటానికి అతనే కారణమని, ఆ ఘనత అతనికే దక్కుతుందని ధోనీ చెప్పాడు. మిగిలిన రెండు మ్యాచ్లలో రామ్పాల్ నుంచి తమకు సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అతను పిచ్పై తేమను సద్వినియోగం చేసుకోవడంలో రాంపాల్ అద్భుత నైపుణ్యాన్ని కనబరుస్తున్నాడు.
మిగిలిన మ్యాచ్లలో అతనికి గౌరవం ఇవ్వకపోతే తమకు కష్టాలు తప్పవన్నాడు. తొలి వన్డేలో భారీ స్కోరు చేసిన టీం ఇండియా రెండో వన్డేలో అతి తక్కువ స్కోరుకు పరిమితం కావడానికి రామ్పాలే కారణం.
మంచి బంతులతో అతను తమ బ్యాట్స్మెన్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇప్పటివరకు తాను చూసిన అత్యుత్తమ బౌలర్లలో రామ్పాల్ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్లో అతను అద్భుతమైన బౌలర్గా అవతరించడం ఖాయమని ధోనీ పేర్కొన్నాడు. |