కరేబియన్ దీవుల్లో అరుదైన వన్డే సిరీస్ విజయంపై మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీం ఇండియా గురిపెట్టింది. వెస్టిండీస్లో వన్డే సిరీస్ విజయానికి ప్రస్తుత టోర్నీలో టీం ఇండియా మిగిలిన రెండు మ్యాచ్లలోనూ విజయం సాధించాల్సి ఉంది. సిరీస్లో తొలి రెండు వన్డేల్లో వెస్టిండీస్, భారత్ చెరొకటి గెలిచాయి.
మిగిలిన రెండు వన్డే మ్యాచ్లు గ్రాస్ ఐస్లెట్లో శుక్ర, ఆదివారాల్లో జరుగుతాయి. గత ఐదు కరేబియన్ దీవుల పర్యటనల్లో భారత్ ఒక్కసారి మాత్రమే వన్డే సిరీస్ గెలుచుకుంది. ఏడేళ్ల క్రితం పర్యటనలో ఆతిథ్యజట్టుపై 1-2 తేడాతో టీం ఇండియా వన్డే సిరీస్ విజయం సాధించింది.
ట్వంటీ- 20 ప్రపంచకప్ వైఫల్యంతో ఈ టోర్నమెంట్లోకి అడుగుపెట్టిన టీం ఇండియా కాస్త ఒత్తిడిలో ఉందనే చెప్పుకోవాలి. ట్వంటీ- 20 ప్రపంచకప్ పరాభవం ఇప్పటికీ టీం ఇండియాను వెంటాడుతోంది. ఇదిలా ఉంటే టీం ఇండియా కరేబియన్ దీవుల్లోకి అడుగుపెట్టకముందు ఆడిన చివరి 18 వన్డే మ్యాచ్లలో మూడింటిలోనే పరాజయం పాలైంది.
అంతేకాకుండా ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానాన్ని ఆక్రమించింది. వన్డేల్లో గత కొంతకాలంగా సత్తా చాటుతున్న టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనలోని తొలి వన్డే మ్యాచ్లో సమర్థవంతంగా ఆడింది. ప్రత్యర్థి ముందు 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ మ్యాచ్లో మెరిపించిన బ్యాట్స్మన్ తరువాతి మ్యాచ్లోనే చేతులెత్తేశారు.
ఫలితంగా సిరీస్ సమం అయింది. ప్రస్తుత సిరీస్లో యువరాజ్ సింగ్ ఒక్కడే ఫామ్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్లో 131, రెండో వన్డేలో 35 పరుగులు సాధించిన యూవీ ఎటువంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు.
మిగిలినవారిలో ధోనీ కూడా పరవాలేదనిపిస్తున్నప్పటికీ, అతనిలో ఇంతకుముందు కసి కనిపించడం లేదు. రెండో వన్డేలో కీలకమైన 95 పరుగులు ధోనీలో తడబాటు మాత్రం తగ్గలేదు. సిరీస్లో మిగిలిన మ్యాచ్లలో రాణించాలంటే బ్యాట్స్మెన్ తప్పనిసరిగా రాణించాల్సిందే. ఎందుకంటే ఓడినా, గెలిచినా బ్యాటింగ్ కారణమనే వాదనను తొలి రెండు వన్డేలే బలపరుస్తున్నాయి. |