వెస్టిండీస్- టీం ఇండియా మధ్య ప్రస్తుతం జరుగుతున్న నాలుగు మ్యాచ్ల వన్డే సిరీస్ అర్థరహితమని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శించారు. ఈ వన్డే సిరీస్ కోసం ప్రస్తుతం టీం ఇండియా కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో మూడో వన్డే శుక్రవారం జరగనుంది. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.
ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. నాలుగు మ్యాచ్ల వన్డే సిరీస్ వెనుకాల లాజిక్ ఎమిటో అంతుబట్టడం లేదన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లు ఆటగాళ్లకు ఊపిరాడనివ్వడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అర్థంలేని సిరీస్లు పెట్టడం ఏమిటని మంజ్రేకర్ ప్రశ్నించారు. ఇటువంటి సిరీస్లు ఆటగాళ్లకు మరింత శ్రమను పెంచుతాయన్నారు.
ఇంగ్లాండ్లో ట్వంటీ- 20 ప్రపంచకప్లో పాల్గొన్న టీం ఇండియా అనంతరం నేరుగా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. టీం ఇండియా ప్రపంచకప్లో సూపర్ ఎయిట్ దశ నుంచి వెనుదిరగడంతో ఆటగాళ్ల ఫిట్నెస్పై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లోని ఆటగాళ్లు ఫామ్ సమస్యలు, నిలకడలోపాలతో ఇబ్బందిపడుతున్నట్లు కనిపిస్తోంది. |