ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్లో పూర్తిగా నిరాశపరిచిన భారత్.. 2010లో జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచ కప్లో "సి" గ్రూపులోకి మారింది. వచ్చే యేడాది కరేబియన్ దీవులు ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా జట్లతో పాటు.. మరో క్వాలిఫైయర్ జట్టు ఉంటుంది.
ఈ క్వాలిఫైయర్ జట్టుతోనే 'టీమ్ ఇండియా' తన తొలి మ్యాచ్లో తలపడుతుంది. టీ-20 ప్రపంచకప్-2010 షెడ్యూలును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. అందులో ఛాంపియన్ పాకిస్థాన్ గ్రూపు "ఏ"లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లతో తేల్చుకుంటుంది.
రన్నరప్ శ్రీలంక గ్రూపు "బి"లో న్యూజిలాండ్, జింబాబ్వేలతో తలపడుతుంది. ఇక గ్రూపు "డి"లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, రెండో క్వాలిఫైయింగ్ జట్టుతో తలపడతాయి. కాగా, ఈ టోర్నీ ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభమై మే 16వ తేదీతో ముగుస్తుంది. రెండు సెమీఫైనల్ మ్యాచ్లు మే 13, 14 తేదీల్లో, ఫైనల్ మ్యాచ్ మే 16వ తేదీన జరుగుతుంది. |