ఎయిర్ ఇండియా బరిలో నిలిపిన రెండు జట్లు సహారా బీసీసీఐ కార్పొరేట్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్కు చేరాయి. ఎయిర్ ఇండియా బ్లూ, ఎయిర్ ఇండియా రెడ్ జట్ల మధ్య మంగళవారం టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీస్లో టాటా స్పోర్ట్స్ క్లబ్పై హర్భజన్ సారథ్యంలోని ఎయిర్ ఇండియా బ్లూ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన చందన్ మదన్ (114)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన టాటా స్పోర్ట్స్ క్లబ్ 267 పరుగులకు ఆలౌటయింది. చివర్లో కెప్టెన్ అజిత్ అగార్కర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాటా స్కోరు 250పైకి చేరింది. అగార్కర్ 35 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్లతో 56 పరుగులు చేశాడు.
ఆ తర్వాత వర్షం కారణంగా ఎయిర్ ఇండియా బ్లూ లక్ష్యాన్ని 45 ఓవర్లలో 246కి కుదించారు. ఓపెనర్ మదన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఏఐ బ్లూ 43.2 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. కైఫ్ (56) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. ధోనీ 16 పరుగులకే నిష్క్రమించాడు. టోర్నీ ఫైనల్ మంగళవారం బెంగళూరులో జరగనుంది.