వన్డేల్లోనూ టెస్ట్ల తరహాలో నాలుగు ఇన్నింగ్స్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహాతో పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ కూడా విభేదించారు. వన్డేల్లోనూ 25 ఓవర్ల చొప్పున నాలుగు ఇన్నింగ్స్ ప్రవేశపెట్టాలని సచిన్ టెండూల్కర్ ఇటీవల సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇలా చేయడం వలన వన్డేలకు ఆదరణ ఇంకా పెరుగుతుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో ట్వంటీ- 20 ప్రవేశం తరువాత వన్డేల భవిష్యత్పై పలువురు మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. సచిన్ ఈ సలహా ఇచ్చాడు. అయితే సచిన్ సలహాను భారత మాజీ కెప్టెన్, ఆల్రౌండ్ దిగ్గజం కపిల్ దేవ్ ఇప్పటికే తోసిపుచ్చాడు.
పాత పద్ధతికే తాను మద్దతిస్తానని కపిల్ చెప్పాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు ఒక్కో ప్రత్యేకత ఉందన్నాడు. ఇప్పుడు కపిల్ అభిప్రాయాలకు ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా నిలిచారు. ఇమ్రాన్ మాట్లాడుతూ.. 50 ఓవర్ల క్రికెట్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఫార్మాట్లో మార్పులు అనవసరమని ఇమ్రాన్ పేర్కొన్నారు.