లాహోర్లో శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన తీవ్రవాద దాడి పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్ను పూర్తిగా మార్చివేసిందనడం అతిశయోక్తి కాదు. ఈ దాడి ప్రభావంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ అనేక ప్రతికూలతలు ఎదుర్కొంటుంది. పాక్ క్రికెట్ను అంతగా ప్రభావితం చేసిన లాహోర్ దాడికి సంబంధించి ఆ దేశ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ సంచలనాత్మక వివరాలు వెల్లడించారు.
లాహోర్ దాడిలో శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని జరిపిన ఎల్టీటీఈ వేర్పాటువాద సంస్థ ప్రమేయం ఉందని పాకిస్థాన్ ప్రధాని గిలానీ తెలిపారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) లాహోర్లో శ్రీలంక జట్టుపై జరిగిన దాడికి వ్యూహరచన చేసిందని వెల్లడించారు. మార్చి 3న జరిగిన ఈ దాడికి ప్రధాన సూత్రధారి ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థేనని ఆయన సంచలనాత్మక వివరాలు బయటపెట్టారు.
ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో ఈ దాడికి సంబంధించి చేసిన ప్రకటనలకు తాజా ప్రకటన పూర్తిగా భిన్నంగా ఉంది. గిలానీ తాజా ప్రకటనలో ఎల్టీటీఈనే ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని వెల్లడించగా, గతంలో పాక్ ప్రభుత్వ పెద్దలు మాత్రం లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ ఈ దాడి చేసిందని వెల్లడించారు.
ముంబయి దాడుల తరువాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో భారత క్రికెట్ జట్టు పాక్ పర్యటనను రద్దు చేసుకుంది. దీంతో పాకిస్థాన్ బోర్డు ఆహ్వానంపై శ్రీలంక జట్టు మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడేందుకు ఆ దేశం వెళ్లింది. టెస్ట్ సిరీస్ సందర్భంగా లాహోర్లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు.
ఇది క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడి పాక్లో అంతర్జాతీయ క్రికెట్ నిర్వహణకు పూర్తిగా వీలు లేకుండా చేసింది. ఇదిలా ఉంటే తాజా దాడిలో ఎల్టీటీఈ ప్రమేయం ఉందని శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స చెప్పినట్లు గిలానీ చెప్పారు. లిబియా పర్యటన సందర్భంగా రాజపక్స దాడిలో ఎల్టీటీఈ ప్రమేయం ఉందనేందుకు ఆధారాలు ఉన్నాయని తనతో చెప్పారన్నారు.
ఈ ఆధారాలు పంచుకోవాలనుకుంటే పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులను శ్రీలంక పంపుతానని నేను ఆ సందర్భంగా రాజపక్సతో చెప్పాను. లాహోర్ దాడి కారణంగా ఆస్ట్రేలియాతోపాటు పలు క్రికెట్ జట్లు పాకిస్థాన్లో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన వన్డే, టెస్ట్ సిరీస్లను రద్దు చేసుకున్నాయి. అంతేకాకుండా భద్రతాపరమైన కారణాలతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా 2011 ప్రపంచకప్ మ్యాచ్లను రద్దు చేసింది.