టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి గంభీర్ పూర్తి ఫిట్నెస్తోనే వెళ్లాడని స్పష్టం చేసింది. శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ సందర్భంగా గజ్జల్లో గాయంతో ఈ సిరీస్లో ఆడకుండానే గంభీర్ స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ గాయం నుంచి గంభీర్ పూర్తిగా కోలుకోకుండానే అతడిని దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీకి పంపారని విమర్శలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ కార్యదర్శి శ్రీనివాసన్ గురువారం మాట్లాడుతూ.. గంభీర్ ఫిట్నెస్పై ఎటువంటి సందేహాలు అవసరం లేదన్నారు. అతను పూర్తి ఫిట్నెస్తోనే దక్షిణాఫ్రికా వెళ్లాడని స్పష్టం చేశారు. దీనిపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పాకిస్థాన్తో జరిగే టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో గంభీర్ ఆడతాడని చెప్పారు.
ఇదిలా ఉంటే గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి యూవరాజ్ సింగ్ పూర్తిగా దూరమవడంపై శ్రీనివాసన్ మాట్లాడుతూ.. యూవీ అర్ధంతరంగా వైదొలగడం జట్టుకు అవకాశాలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. సెహ్వాగ్, జహీర్ సేవలును కోల్పోయిన జట్టుకు యూవీ కూడా దూరం కావడం లోటేనన్నారు. అదే సమయంలో సచిన్, ద్రవిడ్, ధోనీలతో కూడిన జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను తక్కువ అంచనా వేయలేమని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.