గత ఏడాది ముంబయిలో ఉగ్రవాద దాడులు జరిగిన తరువాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు తాము మళ్లీ భారత్ రావాలని అనుకోలేదని, అయితే తమను బలవంతంగా అక్కడికి పంపారని ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ తన స్వీయచరిత్ర (యాషెస్ టు యాషెస్)లో పేర్కొన్నాడు. ముంబయి దాడుల తరువాత తాను భారత్లో టెస్ట్ సిరీస్ ఆడాలని కోరుకోలేదని చెప్పాడు.
అయితే ధనిక బీసీసీఐని ఎదిరించే సాహసం చేయలేక, ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తనను బలవంతంగా భారత్కు పంపిందని ఫ్లింటాఫ్ బోర్డును విమర్శించాడు. ఆటగాళ్లను బలవంతంగా ఆడేందుకు పంపించినందుకు తన పుస్తకంలో ఫ్లింటాఫ్ నిప్పులు చెరిగాడు. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడులు జరిగిన సమయంలోనే ఇంగ్లండ్ భారత్లో ఏడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతోంది.
ఈ దాడుల సంగతి తెలియగానే వన్డే సిరీస్లో మిగిలిన చివరి రెండు వన్డేలు ఆడకుండా స్వదేశానికి వెళ్లింది. అయితే అనంతరం రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం మాత్రం తిరిగి ఆ జట్టు భారత్ వచ్చింది. అయితే టెస్ట్ సిరీస్కు వచ్చే ముందు భారత్లో భద్రతా పరిస్థితులపై జట్టు సభ్యులంతా కూర్చొని తలలు పట్టుకొని ఆలోచించాల్సి వచ్చిందని ఫ్లింటాఫ్ పేర్కొన్నాడు.