ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పీసీబీ సమీక్షకు యూనిస్ ఖాన్ డుమ్మా..! (Cricket | News | Champions Trophy | Pakistan Team | Captain | Younis Khan | Pakistan Cricket Board |)
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు ఆటతీరును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి కెప్టెన్ యూనిస్ ఖాన్ డుమ్మా కొట్టాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ ఇజాజ్ భట్ ఆధ్వర్యంలో స్థానిక గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఖాన్ గైర్హాజర్ అయ్యాడు.
అయితే పాక్ వైస్ కెప్టెన్ ఆఫ్రీదీ, కోచ్ ఇంతికాబ్ ఆలమ్, మేనేజర్ సయూద్, అసిస్టెంట్ మేనేజర్ రాణా, చీఫ్ సెలెక్టర్ ఖాసిం, ముఖ్య పరిపాలనాధికారి వసీం బారీలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. యూనిస్ గురువారమే పీసీబీ చీఫ్తో అన్ని విషయాలను సమగ్రంగా చర్చించాడు కాబట్టి.. ఈ సమావేశానికి రాలేకపోయాడని ఈ మేరకు బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ సందర్భంగా ఇజాజ్ భట్ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు అంచనాలకు మించి రాణించిందని.. సమీక్షలో పాల్గొన్నవారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని వెల్లడించారు. ఇంకా ఈ సమావేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్ గురించి కూడా చర్చించామనీ.. ఇకపై తరచుగా ఇలాంటి సమీక్షా సమావేశాలు జరుపుతామనీ.. అవి తమ పాక్ క్రికెట్కు మేలు చేకూరుస్తాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.