ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మొహాలీ వన్డేలో చేతులెత్తేసిన భారత బ్యాట్స్మెన్స్ (Mohali ODI | India | Batsman | Australia | Victory | Fielders | Bowlers)
అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. మొహాలీ వన్డేలో భారత్ ఓటమిపాలైంది. టీమ్ ఇండియా బ్యాట్స్మెన్స్ ఏమాత్రం ప్రతిఘటించకుండానే చేతులెత్తేశారు. ప్రత్యర్థి జట్టు ఉంచిన 251 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత బ్యాట్స్మెన్స్ నిర్ణీత యాభై ఓవర్ల కోటా పూర్తి కాకముందే 226 పరుగులకే చాప చుట్టేశారు.
ఫలితంగా సిరీస్ చేజిక్కించుకునేందుకు సులువైన మార్గాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా జట్టు అన్ని రంగాల్లో రాణించి సిరీస్ను 2-2 తేడాతో సమానం చేసింది. ముఖ్యంగా, భారత బౌలర్లు ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్లు పడిన శ్రమ వృథాగా పోయింది. అలాగే, మైదానంలో భారత ఫీల్డర్లు చేసిన నాలుగు రనౌట్లు కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
ఆస్ట్రేలియాను 250 పరుగులకు కట్టడిచేసినప్పటికీ ఫలితం దక్కలేదు. సోమవారం జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఏడు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేసుకోవడమే కాకుండా ఆసీస్ ప్రపంచ క్రికెట్లో తమ అగ్రస్థానానికి ఎలాంటి ఢోకా లేదని మరోమారు రుజువు చేసింది.
బౌలర్లు, ఫీల్డర్లు చేసిన కృషిని బ్యాట్స్మెన్ వమ్ముచేశారు. ఆసీస్ 49.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా 46.4 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరీస్లో తొలిసారి టాస్ గెలిచిన ధోనీ ప్రత్యర్థిని బ్యాటింగ్ ఆహ్వానించడంతోనే భారత్ ఓటమి ఖాయమని తేలిపోయింది. ఐదో వన్డే గురువారం హైదరాబాద్లో జరుగనుంది.