నేడు ఉప్పల్ స్టేడియంలో సమ ఉజ్జీల పోరు

గురువారం, 5 నవంబర్ 2009( 09:31 IST )
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ప్రపంచ క్రికెట్లో రెండు మేటి జట్ల మధ్య మరో ఆసక్తికరమైన క్రికెట్ పోరు జరుగనుంది. ఏడు వన్డేల సిరీస్లో భాగంగా ఐదో వన్డే ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు వన్డేల్లో రెండు జట్లు రెండేసి మ్యాచ్లలో గెలుపొంది సమ ఉజ్జీలుగా ఉన్నాయి.
అందువల్ల ఐదో వన్డే అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ ఆధిక్యాన్ని కూడబెట్టుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అదేసమయంలో ఇరు జట్లను కొన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. టీమ్ ఇండియాకు ఉప్పల్ స్టేడియం అచ్చిరాని వేదికకగా ఉంది. ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్లలో భారత జట్టు ఓటమిని చవిచూసింది.
ఇకపోతే.. ఆస్ట్రేలియా జట్టును గాయాలు వేధిస్తున్నాయి. తుది 11 మంది ఆటగాళ్లను సైతం ఎంపిక చేసేందుకు వీలులేకుండా పోయింది. గాయాలబారిన పడిన క్రికెటర్ల స్థానంలో హుటాహుటిన వచ్చిన ఆటగాళ్ళపై ఆసీస్ జట్టు ఆధారపడాల్సి వస్తోంది.
అలాగే, భారత జట్టులో గాయం కారణంగా నాలుగో వన్డేకు దూరమైన గౌతం గంభీర్ కోలుకుని తుది జట్టులోకి ఎంపిక కానున్నాడు. ఇది టీమ్ ఇండియాకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే, ఆసీస్ జట్టులో ప్రధాన ఆటగాళ్లు గాయాల బారిన పడి అందుబాటులో లేక పోయినప్పటికీ.. ఉన్న ఆటగాళ్లే గట్టి పోరాట పటిమ కనుబరుస్తున్నారు.
ప్రధానంగా కెప్టెన్ రికీ పాంటింగ్, వాట్సన్, హుస్సేలు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇకపోతే.. భారత జట్టు ఆటగాళ్ళ ప్రదర్శన ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు. ఒక మ్యాచ్లో ఆకాశమే రెచ్చిపోయే ధోనీ సేన.. మరుసటి మ్యాచ్లో స్వల్ప విజయలక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడుతోంది. ఫలితంగా ఉప్పల్ వన్డే మరింత ఉత్కంఠతను రేకెత్తించనుంది.
భారత జట్టు.. వీరేంద్ర సెహ్వాగ్, టెండూల్కర్, గంభీర్, యువరాజ్, ధోనీ (కెప్టెన్), సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, ప్రవీణ్ కుమార్, ఇశాంత్ శర్మ, ఆశీష్ నెహ్రా.
ఆస్ట్రేలియా జట్టు.. షేన్ వాట్సన్, షాన్ మార్ష్, రికీ పాంటింగ్, మైఖెల్ హస్సీ, కామెరూన్ వైట్, ఆడమ్ వోగ్స్, గ్రహం మానోవ్, మిచెల్ జాన్సన్, హౌరిట్జ్, బెన్ హిల్పెన్హాస్, బొలింగర్.