ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » హైదరాబాద్ వన్డే: భారత్ ముంగిట భారీ విజయలక్ష్యం (Hyd | ODI | Australia | India | Batsman | Six | Fours | Toss)
హైదరాబాద్ వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ కదం తొక్కారు. ఫోర్లు, సిక్స్లతో భారత బౌలర్ల భరతం పట్టారు. ఫలితంగా ఆ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. దీంతో భారత్ ముంగిట 351 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. టీమ్ ఇండియా టాప్ ఆర్డర్తో పాటు.. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అద్భుతంగా రాణిస్తేనే విజయం సాధ్యం అవుతుంది.
అంతకుముందు టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన వాట్సన్ (93), మార్ష్ (112)లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్ల భరతం పట్టే బాధ్యతను తొలుత వాట్సన్ స్వీకరించాడు. 89 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 93 పరుగులు చేసి, తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
అప్పటి వరకు నెమ్మదిగా ఆడుతూ వచ్చిన మరో ఓపెనర్ మార్ష్.. అక్కడ నుంచి రెచ్చిపోయి సెంచరీ చేశాడు. మొత్తం 112 బంతులను ఎదుర్కొన్న మార్ష్ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో ఈ స్కోరు చేశాడు. అయితే, కెప్టెన్ రికీ పాంటింగ్ తన వంతుగా 45 పరుగులు చేశాడు. రికీ, మార్ష్ అనంతరం క్రీజ్లోకి వచ్చిన వైట్ (57), హుస్సేలు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు.
వైట్ 33 బంతుల్లో ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లతో రెచ్చిపోగా, హుస్సే 22 బంతుల్లో రెండు సిక్స్లు, ఒక ఫోరుతో తన వంతు సహకారం అందించాడు. ఫలితంగా 350 పరుగుల స్కోరు చేసింది. అసలే బ్యాటింగ్ పిచ్పై టీమ్ ఇండియా బౌలర్లు చెత్తగా బౌలింగ్ చేయడం, దీనికి తోడు అద్వాన్నమైన ఫీల్డింగ్, ఫీల్డర్లు క్యాచ్లు వదిలి వేయడం ఆసీస్ బ్యాట్స్మెన్స్కు బాగా కలిసి వచ్చింది.
భారత బౌలర్లలో ప్రవీణ్ కుమార్ రెండు వికెట్లు తీయగా, నెహ్రా, హర్భజన్ సింగ్లు ఒక్కో వికెట్ తీశాడు. అలాగే, మన బౌలర్లో భజ్జీ మాత్రమే పది ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చాడు. మిగిలిన వారంతా ఓవర్కు ఏడు, ఎనిమిది పరుగులు సమర్పించుకున్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో 13 సిక్స్లు నమోదు కావడం విశేషం.