అహ్మదాబాద్లో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ చివరి రోజున భారత ఓపెనర్ గౌతం గంభీర్ సెంచరీ చేశాడు. 187 బంతులను ఎదుర్కొన్న గంభీర్ 11 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇది తన టెస్టు కెరీర్లో ఏడో సెంచరీ కాగా, శ్రీలంకపై మొదటి సెంచరీ కావడం గమనార్హం. ఫలితంగా భారత జట్టు లంచ్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
అంతకుముందు.. నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 192/2తో ఐదో రోజున ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్ ఇండియా ఇన్నింగ్స్లో మూడో వికెట్ త్వరగానే కోల్పోయింది. నైట్ వాచ్మెన్గా బరిలోకి దిగిన అమిత్ మిశ్రా (24) జట్టు స్కోరు 209 పరుగుల మీద ఉండగా, మ్యాథ్యూస్ బౌలింగ్లో దిల్షాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన సచిన్ (22) గంభీర్తో కలిసి నింపాదిగా ఆడుతున్నారు. ఈ క్రమంలో గంభీర్ టెస్టుల్లో ఏడో సెంచరీని పూర్తి చేస్కున్నాడు.