ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » అజహర్పై నిషేధం ఎత్తివేతకు కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడి (Congress | wants | ban | Azhar | lifted | MPs | Pawar | BCCI)
అజహర్పై నిషేధం ఎత్తివేతకు కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడి
శనివారం, 21 నవంబర్ 2009( 16:40 IST )
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్పై ఉన్న జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై వారు ఒత్తిడి తెస్తున్నారు. ఈ అంశంపై కేంద్రం వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్తో శుక్రవారం భేటీ అయ్యారు.
2000లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో అజహర్ను బీసీసీఐ దోషిగా తేల్చిన విషయం తెల్సిందే. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ లోక్సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అజహర్ విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు.
దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలు పలువురు అజహర్పై ఉన్న నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిలో ఎంపీలు జతిన్ ప్రసాద్, బీసీసీఐ ఆర్థిక కమిటీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా, సినీ నటుడు రాజ్బబ్బర్లు ఉన్నారు. వీరు ఐసీసీ ఉపాధ్యక్షుడు శరద్ పవార్తో సమావేశమై అజహహర్ అంశంపై చర్చించారు.
దీనిపై రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్తో చర్చించాం. నిషేధాన్ని ఎత్తివేయాలని అజహర్ కూడా స్వయంగా కోరిన పక్షంలో తాము.. బీసీసీఐ వార్షిక సర్యసభ్య సమావేశంలో ప్రతిపాదించి చర్చిస్తామని మనోహర్ చెప్పినట్టు శుక్లా తెలిపారు.
హైదరాబాద్కు చెందిన ఈ కుడిచేతివాటం ఆటగాడు అజారుద్దీన్ భారత క్రికెట్ జట్టు తరపున 99 టెస్టులు ఆడి 6215 పరుగులు చేశాడు. అలాగే, 334 వన్డేలు ఆడిన అజ్జూ భయ్యా 36.92 సగటుతో 9378 పరుగులు చేశాడు.