శ్రీలంక ఓపెనర్ సనత్ జయసూర్య రాజకీయాల్లోకి ప్రవేశించాడు. మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ స్థానంలో ఆడుతోన్న జయసూర్య.. ఏప్రిల్ 8వ తేదీ జరుగనున్న శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పార్టీ తరపున తన సొంత ఊరైన మదరా నియోజక వర్గం నుంచి జయసూర్య ఎన్నికల బరిలోకి దిగనున్నాడు.
40 ఏళ్ల జయసూర్య టెస్టు క్రికెట్ నుంచి 2007వ సంవత్సరం రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం 50 ఓవర్ల వన్డే, పరిమిత ఓవర్ల ట్వంటీ-20ల్లో ఆడుతున్న జయసూర్య, 2011వ సంవత్సరంలో జరుగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచకప్ తర్వాత క్రికెట్కు పూర్తిగా స్వస్తి చెప్పనున్నట్లు తెలిసింది.
ఇకపోతే.. ఐపీఎల్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న జయసూర్య, క్రికెట్ రంగంలో ఉంటూనే రాజకీయాల్లోకి ప్రవేశించడం సరికాదని అర్జున రణతుంగ అన్నారు.
మరోవైపు.. రణతుంగ కెప్టెన్సీ సారథ్యంలో 1996వ సంవత్సరంలో ప్రపంచకప్ను శ్రీలంక సొంతం చేసుకుంది. 1996 ప్రపంచకప్ తర్వాత రణతుంగ క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. తదనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన రణతుంగ.. ప్రస్తుతం శ్రీలంక ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు మద్దతుగా జయసూర్య ప్రచారం చేయడం గమనార్హం.