ఆసీస్ సొంత గడ్డపై ఓడించిన భారత జట్టులో ఉన్న భారత జట్టు సభ్యుల్లో ఎక్కువ శాతం యువకులదే కీలకం. జట్టులో సచిన్, హర్భజన్, సెహ్వాగ్లు మాత్రమే సీనియర్ సభ్యులుగా వున్న మిగిలిన 16 మంది జట్టులో యువకులే అధికంగా వున్నారు. యువకులదే కీలకపాత్ర అనడంలో సందేహం లేదు. గంభీర్, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, ఉతప్ప, ప్రవీణ్ కుమార్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్లో అంచనాలకు మించి రాణించారు. ఆ ఫలితంగానే భారత జట్టు విజయఢంకా మోగించింది.
ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు పాటించే ఎత్తుగడలు, చాతుర్యం, టెక్నిక్స్ను భారత యువకులు సొంతం చేసుకున్నారు. అందువల్లే ఆసీస్ గడ్డపై ఆసీస్ను మట్టికరపించారు. ముక్కోణపు సిరీస్ ఆరంభం నుంచి యువ క్రికెటర్లు అద్భుతంగా రాణించారు. వారికి తోడు బ్యాటింగ్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ రాణింపు, హర్భజన్ సింగ్ కీలక సమయంలో వికెట్లు తీయడం వంటి పరిణామాలు భారత్ను విజయం వైపు నడిపించాయి. ఈ సిరీస్లో అంచనాలకు మించి రాణించిన కొంతమంది ఆటగాళ్ళ ఆటతీరును పరిశీలిస్తే..
‘గంభీర’మైన ఇన్నింగ్స్... వన్డే సిరీస్ ఆరంభం నుంచి ఓపెనర్ గౌతం గంభీర్ ఎంతో ఆకట్టుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లలో సరిగా రాణించలేక పోయిన ఈ ఢిల్లీ యువ గంభీరం.. లీగ్ దశలో భారత బ్యాటింగ్కు వెన్నెముకగా నిలిచాడు. అందుకే భారత జట్టులో ఉత్తమ బ్యాట్స్మెన్గా నిలిచాడు. గతంలో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఈ పర్యటనే తనకు టర్నింగ్ పాయింట్ అని గంభీర్ స్వయంగా ప్రకటించాడు. ఓ సెంచరీతో పాటు రెండు మార్లు అర్థ సెంచరీలు పూర్తి చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో కూలిపోతున్న భారత బ్యాటింగ్ నావను ఒడ్డుకు చేర్చిన ఘనతను దక్కించుకున్నాడు. అయితే.. ఫైనల్ మ్యాచ్లలో మాత్రం.. గంభీరమైన ఇన్నింగ్స్ ఆడలేక పోయాడు.
రో"హిట్" శర్మ... ముంబై యువ హీరో. మరో సచిన్ అని క్రికెట్ అభిమానులు పిలుచుకుంటున్న క్రికెటర్. అయితే తన ఆరాధ్య క్రికెటర్తో తనను సరిపోల్చవద్దని వినమ్రయంగా చెప్పుకునే రోహిత్ శర్మ కీలక దశలో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ను గట్టెక్కించాడు. ముఖ్యంగా తొలి ఫైనల్ మ్యాచ్లో సచిన్తో కలసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో రోహిత్ శర్మ చూపిన సంయమనం, తెగువ, పోరాట పటిమ ఎవరూ మరచిపోలేరు. ఈ భాగస్వామ్యమే భారత్ను విజయం వైపు మళ్లించింది.
|