జపాన్లోని యొకోహొమాలో ప్రారంభమైన ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నీ క్వాలిఫైయింగ్ రౌండులో భారత్ విజయంతో శుభారంభం చేసింది. కొత్త జాతీయ మహిళా ఛాంపియన్ కుమరేశన్ షామినీ సహా భారత్కు చెందిన ఆరు మంది క్రీడాకారులు తొలి రౌండులో జరిగిన సంబంధిత మ్యాచ్లలో అలవొకగా విజయపతాకాన్ని ఎగురవేశారు.
దాదాపు వీరందరూ ప్రత్యర్థులపై 4-0 స్కోర్లైన్తో గెలుపొందడం విశేషం. న్యూజిలాండ్కు చెందిన గార్మెట్ డెబ్బీపై షామినీ గెలుపొందగా.. పురుషుల సింగిల్స్ విభాగంలో సూడాన్కు చెందిన ఇ మాక్ ఒసామా అహ్మద్పై మాజీ జాతీయ ఛాంపియన్ సుభాజిత్ సాహా విజయం సాధించాడు.
మరో మ్యాచ్లో నేపాల్కు చెందిన రాకేశ్ మహార్జన్పై సౌరవ్ చక్రవర్తి, కొస్తా రికాకు చెందిన జిమినెజ్ డేనియల్పై ఎ అమల్ రాజ్, మాల్టాకు చెందిన బి డేనియల్పై పాథిక్ మెహతాలు విజయందుందుభి మ్రోగించారు. మహిళా సింగిల్స్ విభాగంలో ఫిన్లాండ్కు చెందిన నైబెర్గ్ హన్నాపై భారత మాజీ జాతీయ ఛాంపియన్ పౌలోమీ ఘతక్ గెలుపొందింది.
ఒలింపిక్ పాడ్లర్ అచంటా శరత్ కమల్.. పురుషుల సింగిల్స్ విభాగంలో తన జైత్రయాత్ర ప్రారంభించాడు. నార్వేకు చెందిన వాంగ్ జీయాన్ఫెంగ్పై శరత్ గెలుపొందాడు. కాగా, ఈ క్వాలిఫై మిక్సడ్ డబుల్స్ విభాగంలో భారత జోడీలయిన అమల్ రాజ్-మధురికా పాట్కర్లు, పాథిక్-కస్తూరీలకు ప్రిలిమినరీ రౌండులో బై పడింది. |