యెరెవాన్లో మే 22 నుండి ప్రారంభం కానున్న ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ కోసం ఎనిమిది మంది సభ్యులు గల భారత జూనియర్ బాక్సింగ్ బృందం బయలుదేరి వెళ్లనుంది. గత ఏడాది ఛాంపియన్షిప్స్లో భారత బాక్సర్లు రెండు పసిడి పతకాలు, ఒక రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.
అజెర్బైజాన్లోని బాకులో 2007లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్స్లో భారత్ అద్భుత ప్రదర్శనను కనబరిచి ఈ మూడు పతకాలను గెలుచుకుంది. కానీ ఈ ఏడాది మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల నుండి సుమారు 300 మందికి పైగా బాక్సర్లు పాల్గొంటున్నారు.
కాడెట్ ప్రపంచ ఛాంపియన్షిప్లుగా పిలుచుకునే ఈ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ గత ఎడిషన్లో భారత బాక్సర్ విపిన్ కుమార్.. బెస్ట్ బాక్సర్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఈ ట్రోఫీనీ ఒక భారత బాక్సర్ కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.
కాగా, ఈ ఏడాది అజెర్బైజాన్లో జరిగిన ప్రతిష్టాత్మక హైడర్ అలియెవ్ కప్ టోర్నీలో పసిడి పతకాన్ని గెలుచుకున్న భారత బంటామ్ వెయిట్ (52 కేజీలు) ఆటగాడు శివా థపాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అదలా ఉంచితే.. 2007లో చక్కటి ప్రదర్శన కనబరిచిన వారిని ప్రధానంగా ఈ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్స్ వెళ్లే జట్టులో ఎంపిక చేసినట్లు జాతీయ జూనియర్ కోచ్ ఎంఎస్ ధాకా తెలిపారు. |