ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో జైత్రయాత్ర సాగించిన భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ 1700 పాయింట్లు దక్కించుకుని ఏటీపీ తాజా డబుల్స్ ర్యాంకుల్లో ఐదో స్థానానికి ఎగబాకాడు. సోమవారం ఈ తాజా ర్యాంకుల జాబితాను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య విడుదల చేసింది.అంతకుముందు.. 6560 పాయింట్లతో ఉన్న పేస్ ఫ్రెంచ్ ఓపెన్తో పాటు మొత్తం తొమ్మిది గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుని మొత్తం 8260 పాయింట్లు తన ఖాతాలో జమచేసుకున్నాడు. మరోవైపు బహమాస్కు చెందిన పేస్ భాగస్వామి మార్క్ నోవెల్స్... ఫ్రెంచ్ ఓపెన్ ప్రీ-క్వార్టర్స్ నుండే వైదొలిగాడు. దీంతో నోవెల్స్ 5560 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు.అదలా ఉంచితే.. డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మూడు స్థానాలు దిగజారి 98వ ర్యాంకుకు పడిపోయింది. డబుల్స్లో మాత్రం నాలుగు స్థానాలు ఎగబాకి 39వ స్థానానికి సానియా చేరుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విభాగం తొలి రౌండు నుండే సానియా వైదొలగగా.. డబుల్స్లో రెండో రౌండు వరకు మాత్రమే వెళ్లగలిగింది. |