విదేశాల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ నేటి క్రీడాకారులు అంతర్జాతీయంగా దేశానికే వన్నె తెస్తున్నారు. ఇతర దేశాల క్రీడాకారుల తరహాలో సౌకర్యాలు అందుబాటులో లేకపోయినప్పటికీ.. వారితో సమానంగా భారత క్రీడాకారులు రాణిస్తుండటం విశేషం.ఇందుకు నిదర్శనగా.. సింగపూర్లో జరగుతున్న ప్రారంభం (తొలి) ఆసియా యూత్ క్రీడా టోర్నీ చెప్పుకోవచ్చు. ఈ టోర్నీ ప్రారంభమైన రోజునే భారత అథ్లెట్లు వేర్వేరు విభాగాల్లో ఒక పసిడి పతకంతో సహా మూడు పతకాలను గెలచుకున్నారు. డిస్కస్ త్రో ఈవెంట్లో అర్జున్ పసిడి పతకం సాధిస్తే.. 1500 మీటర్ల పరుగు పందెంలో రాహుల్ కుమార్ రజత పతకాన్ని, మహిళల 1500 మీటర్ల ఈవెంట్లో పూజా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 58.72 మీటర్ల దూరంతో అర్జున్ డిస్కస్ త్రోలో తొలి స్థానంలో నిలిచాడు.రాహుల్ 4:05.01తో రెండో స్థానంలో నిలిచాడు. పూజా 4:39.04తో మూడో స్థానంలో నిలిచింది. పసిడి పతకాన్ని గెలుచుకున్న అనంతరం అర్జున్ మాట్లాడుతూ, తొలి ఆసియా యూత్ క్రీడల్లో ఈ పతకాన్ని గెలుపొందడం సంతృప్తినిచ్చినట్లు తెలిపాడు. తన కఠోరశ్రమకు వచ్చిన ఫలితంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. |