ప్రపంచ దేశాలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి ముగ్గురు టెన్నిస్ ఆటగాళ్లను కూడా సోకినట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మక వింబుల్డన్లో ప్రపంచ 29వ ర్యాంకు డబుల్స్ ఆటగాడు మైకేల్ మెర్తినాక్, 22వ ర్యాంకు పొలసెక్ (స్లోవేకియా), 25వ ర్యాంకు త్రావిన్ పారోట్లు స్వైన్ ఫ్లూ బారిన పడారని తెలిసింది.
ప్రస్తుతం ఫ్లూ నుంచి వారు మెల్లమెల్లగా కోలుకుంటున్నారని సమాచారం. ఫ్లూ సూచనలు కనిపించిన వెంటనే వింబుల్డన్ నిర్వాహం టోర్నీకీ దూరంగా ఉండాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా.. మనదేశంలో స్వైన్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో తొమ్మిది మందికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు అధికారిక వర్గాలు నిర్ధారణకు వచ్చాయి.
దీంతో దేశవ్యాప్తంగా వెలుగుచూసిన మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 113కి చేరుకుంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ బారినపడిన వారి సంఖ్య 70,893కి చేరుకుందని మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. |