భారత్లో హాకీ క్రీడ గత కొన్నేళ్లలో వేగంగా వెనుకబడటం తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తోందని చీఫ్ కోచ్ జోస్ బ్రాసా వెల్లడించారు. ఏదేమయినప్పటికీ.. వచ్చే ఏడాది భారత్లో జరిగే హాకీ ప్రపంచకప్ పోటీల నాటికి తమ జట్టు సిద్ధంగా ఉండగలదని వ్యాఖ్యానించారు.25 రోజుల యూరోప్ పర్యటన కోసం న్యూఢిల్లీ నుండి బయలుదేరి వెళ్లే కొద్ది గంటల ముందు బ్రాసా విలేకరులతో మాట్లాడారు. హాకీ క్రీడా విభాగంలో ఒలింపిక్స్లో గరిష్ఠంగా పసిడి పతకాలను నెగ్గిన భారత్.. ప్రస్తుతం ఇతర దేశాలతో పోటీపడలేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తున్నట్లు తెలిపారు.తన పేరిట ఎన్నో ఒలింపిక్స్ పతకాల గెలుచుకున్న భారత హాకీకి ఇది జీర్ణించుకోలేని విషయమన్నాడు. అలాగే ఈ క్రీడలో ప్రాథమిక విషయాలను తెలుసుకునేందుకు సైతం యూరప్ వెళుతుండటం... ఇంతటి వ్యత్యాసం ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు.అయితే ప్రస్తుత భారత జట్టులో అత్యున్నత నైపుణ్యం కలిగిన ఆటగాళ్లున్నారని.. కానీ ఎందుకో గానీ.. ఈ క్రీడకు ఉండాల్సి ప్రాథమిక విషయాలను వారు కోల్పోయారని బ్రాసా తెలిపారు. తాను చేసేది విమర్శ కాదని.. ఎన్నో పతకాలను గెలుచుకున్న భారత్ ఇప్పుడు ఇతర దేశాల స్థాయిలో లేకపోవడం ఆశ్చర్యంగా కలిగిస్తోందన్నారు.తాము ప్రస్తుతం యూరప్ పర్యటనకు వెళ్తున్నా.. ఇందులో ఆటగాళ్ల నైపుణ్యాన్ని మెరుగుపరిచే దిశగానే ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఈ పర్యటనలో గెలుపు ఓటములపై శ్రద్ధ వహించడం లేదని.. 2010 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను సిద్ధం చేస్తామన్నారు.కాగా, 25 రోజుల ఈ పర్యటనలో ఇంగ్లండ్, బెల్జియం, స్పెయిన్, హాలెండ్లతో కలిపి భారత్ మొత్తం 12 టెస్ట్లలో పాల్గొంటుంది. ఈ పర్యటనకు ముందు ఐదు వారాల పాటు బ్రాసా నేతృత్వంలోని భారత జట్టుకు పూనేలో శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. |