వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ర్యాంకింగ్స్: మెరుగుపడిన సోమ్‌దేవ్, బోపనా (Tennis ranks | Somdev | Bopanna | Yuki Bhambri | Sania | Mahesh Bhupati | Leander Paes | Malaysia Open)
 
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య తాజాగా ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకుల్లో భారత్‌కు చెందిన యువ కెరటాలు... సోమ్‌దేవ్ దేవవర్మన్, రోహన్ బోపనా, యూకీ బాంబ్రీల ర్యాంకులు మెరుగుపడ్డాయి. సోమ్‌దేవ్.. నాలుగు ర్యాంకులు ఎగబాకి 129వ స్థానానికి చేరుకుని భారత్ తరపున పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌లో టాప్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

ఇక డేవిస్ కప్ జట్టు సభ్యుడు రోహన్ బోపనా.. ఏకంగా 89 ర్యాంకులను అధిగమించి 358వ స్థానానికి చేరుకున్నాడు. గత వారం ఏటీపీ మలేషియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బోపనా అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో ప్రపంచ నెంబర్ 51వ ర్యాంకు ఆటగాడు జోస్ అకాసుసోపై గెలుపొందాడు.

అలాగే ప్రపంచ నెంబర్ 12వ ర్యాంకు స్టార్ ఆటగాడైన ఫెర్నాండో గొంజాలెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపు గెలిచినంత పనిచేశాడు. ఇక యూకీ బాంబ్రీ.. ఏడు స్థానాలను మెరుగుపరుచుకుని 403వ ర్యాంకుకు చేరుకున్నాడు. కోల్‌కతాలో తాజాగా జరిగిన ఓఎన్‌జీసీ ఐటీఎఫ్ ఫ్యూచర్స్ ఫైనల్లో గెలుపొంది కెరీర్‌లో ఐదో టైటిల్‌ను యూకీ కైవసం చేసుకున్నాడు.

ఇక తాజా ర్యాంకుల్లో డబుల్స్ జాబితాలో భారత టెన్నిస్ స్టార్లు మహేశ్ భూపతి (6వ స్థానం), లియాండర్ పేస్ (8వ స్థానం)లు యథావిధిగా కొనసాగుతున్నారు. మహిళా సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం 61వ స్థానంలో ఉంది. కానీ.. డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.