భారత్లో క్రికెట్కు లభిస్తున్న ఆదరణ మరే క్రీడలకూ లభించటం లేదనీ, ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని... భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. స్వగ్రామం నాగండ్లకు వెళుతున్న సందర్భంగా ఆయన చీరాలలో కాసేపు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.
ప్రస్తుతం మన దేశంలోని కార్పొరేట్ సంస్థలు క్రికెట్కు అధికంగా ప్రాధాన్యత నిస్తున్నాయనీ.. దీంతో మరే ఇతర క్రీడలకూ సరైన ఆదరణ లభించటంలేదని గోపీచంద్ వాపోయారు. ఈ సంస్థలు ఇతర క్రీడలకు కూడా సరైన ప్రోత్సాహాన్ని అందించినట్లయితే.. అవి కూడా గాడిలో పడతాయని అన్నారు.
ఇటీవలి కాలంలో బ్యాడ్మింటన్కు కూడా మంచి ఆదరణ లభిస్తోందనీ.. అయితే సరైన ప్రోత్సాహం లేక ఎంతోమంది ప్రతిభావంతులు కెరీర్ను కొనసాగించలేక పోతున్నారని గోపీచంద్ పేర్కొన్నారు. ఇలాంటి వారికి తగిన సహకారం అందించినట్లయితే.. ఒలింపిక్ లాంటి పోటీలలో పతకాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు.
ప్రపంచ బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్, చేతన్, గుత్తా జ్వాల లాంటి అగ్రశ్రేణి క్రీడాకారులను.. ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకుని బ్యాడ్మింటన్ రంగంలోకి అడుగుపెడుతున్నారని గోపీచంద్ చెప్పారు. ఈ యువ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత క్రీడా సంఘాలు, కార్పొరేట్ సంస్థలపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.