ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రపంచ కప్ బెర్త్పై దృష్టి సారించిన భారత హాకీ (World Cup Hockey | Indian Team | South Korea | Asia Cup Hockey)
వచ్చే ఏడాదిలో జరిగే ప్రపంచ కప్ టోర్నీలో స్థానం పొందడం కోసం భారత హాకీ జట్టు ప్రయత్నిస్తోంది. మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో శుక్రవారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియాపై గెలుపొంది తద్వారా ప్రపంచకప్ హాకీ టోర్నీలో బెర్త్ సంపాదించాలని భారత జట్టు చూస్తోంది.
శుక్రవారం మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే.. మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో స్థానం ఖరారవుతుంది. వచ్చే ఏడాది ఆగస్ట్- సెప్టెంబర్లో అర్జెంటీనాలోని రొసారియోలో ఈ ప్రపంచకప్ జరుగనుంది. అదలా ఉంచితే.. ఇదే ఆసియా కప్ గత ఎడిషన్లో ఇదే ప్రత్యర్థి చేతిలో 2-5తో భారత్ ఓటమి చవిచూసింది. హాంకాంగ్లో జరిగిన ఆ టోర్నీలో ఇదే తరహాలో సెమీస్లో భారత్, కొరియాలు తలపడ్డాయి.
ప్రపంచ కప్ బెర్త్ కోసమే ఆ టోర్నీలో భారత్ తీవ్రంగా శ్రమించి పోరాడి ఓడింది. అయితే.. కొరియా అప్పటి జట్టు వేరు.. ఈ సారి బరిలోకి దిగుతున్న జట్టు వేరు. ఇప్పటి జట్టు పూర్తిగా యువరక్తం పొర్లి పొరులుతోంది. అనుభవలేమితో కొరియా జట్టు నిండి ఉంది. గత ఆసియా కప్ తర్వాత దాదాపు పది మంది ఆటగాళ్లు ఆటకు గుడ్బై చెప్పేశారు.
అలాగని ఈ టోర్నీలో భారత్ పని అత్యంత సులువైనదిగా భావించాలని కాదు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో కొరియా జట్టు ఒక్క ఓటమిని కూడా ఎదుర్కొనలేదు. అన్ని జట్లకు ధీటుగా కొరియా సమాధానం చెబుతోంది. కనుక భారత్ జట్టు సమిష్టి కృషితో... సర్వ శక్తులూ ఒడ్డి పోరాడాల్సిన అవసరం ఉంది.