ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ : రాజేందర్కు స్వర్ణం (Sports I YS Rajasekhara Reddy I National Junior Sub Junior Athletics Championship I Rajender I)
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక జాతీయ జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తొలిరోజే ఆంధ్రప్రదేశ్ పతకాల బోణీ చేసింది. మంగళవారం హన్మకొండ జేఎన్ స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీలలో అండర్-16 బాలుర 3 వేల మీటర్ల రేసులో రాజేందర్ సింగ్ రాష్ట్రానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు.
3 వేల మీటర్ల రేసు లక్ష్యాన్ని రాజేందర్ 9 నిమిషాల 07 సెకన్లలో ఛేదించి అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే అండర్-20 బాలికల 3 వేల మీటర్ల రేసులో రాష్ట్రానికే చెందిన వనిత కాంస్య పతకాన్ని సాధించింది. పది నిమిషాల 41 సెకన్లలో లక్ష్యానికి చేరుకున్న వనిత మూడో స్థానంలో నిలిచింది. మొత్తంమీదా ఈ పోటీల తొలిరోజున ఆంధ్రప్రదేశ్కు రెండు పతకాలు లభించాయి.
అలాగే.. ఈ పోటీల తొలి రోజున మరో రెండు కొత్త జాతీయ రికార్డులు కూడా నమోదయ్యాయి. అండర్-14 బాలుర షాట్ఫుట్లో కేరళకు చెందిన నిఖిల్ నితిన్ ఇనుప గుండును 13.41 మీటర్ల దూరం విసిరి రికార్డు సృష్టించాడు. దీంతో తమిళనాడుకు చెందిన ఎస్.ఎల్.మూర్తి 12.48 మీటర్లతో ఉన్న రికార్డును నితిన్ అధిగమించాడు.
అండర్-14 బాలికల షాట్ఫుట్లో తమిళనాడుకు చెందిన కె. సుభాషిణి కూడా మరో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇనుప గుండను 10.17 మీటర్ల దూరం విసిరిన సుభాషిణి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుమునుపు ఈ పోటీలను రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రారంభించారు.