ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » వరల్డ్ స్నూకర్ ఛాంప్స్: అద్వానీకి "హ్యాట్రిక్" విజయం (Sports I Hyderabad I World Snooker Championship I Pankaj Advani I Masters League I Geeth Sethi)
వరల్డ్ స్నూకర్ ఛాంప్స్: అద్వానీకి "హ్యాట్రిక్" విజయం
FILE
హైదరాబాద్ నగరంలోని ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ సెంటర్లో జరుగుతున్న ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ జోరు కొనసాగుతోంది. ఈ టోర్నో మొదటి మొదటి నుంచి విజయాల బాటలో నడుస్తున్న పంకజ్.. ముచ్చటగా మూడో గేమ్ కూడా నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
అయితే తొలి రెండు లీగ్ పోటీలలో అలవోకగా నెగ్గిన జాతీయ ఛాంపియన్ పంకజ్ అద్వానీకి మూడో రౌండ్లో మాత్రం గట్టి పోటీ ఎదురైంది. వేల్స్కు చెందిన ఫిలిప్ విలియమ్స్తో జరిగిన ఈ మూడో రౌండ్ పోటీలో అద్వానీ 4-3 ఫ్రేమ్ల (66-48, 48-55, 106-0, 91-27, 33-73, 41-56, 54-16) తేడాతో గెలుపొందాడు.
కాగా.. ఆరుగురు ఉన్న గ్రూప్-ఎలో ప్రస్తుతం అద్వానీ ఈ మూడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే గ్రూప్-సిలో ఉన్న యాసిన్ మర్చంట్ కూడా తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. అమెరికాకు చెందిన అహ్మద్ అలీతో జరిగిన ఆటలో యాసిన్ 4-2 ఫ్రేమ్ల తేడాతో గెలిచి.. వరుసగా మూడో విజయాన్ని కైవసం చేసుకున్నాడు.
మరోవైపు మాస్టర్స్ విభాగంలో గీత్ సేథీకి మూడో లీగ్ పోటీలో చుక్కెదురైంది. న్యూజిలాండ్కు చెందిన క్లైవ్ థాంప్సన్తో జరిగిన ఆటలో గీత్ సేథీ 3-2 ఫ్రేమ్ల తేడాతో అపజయం పాలయ్యాడు. ఇక ఇతర పోటీలలో.. సందీప్ 4-0 ఫ్రేమ్ల తేడాతో ఖతార్కు చెందిన ఒబైదలీపై, 4-1 ఫ్రేమ్ల తేడాతో షాబాజ్ దక్షిణాఫ్రికాకు చెందిన పియరీపై, ఐర్లాండ్కు చెందిన లియోనార్డ్పై బ్రిజేశ్ 4-1 ఫ్రేమ్ల తేడాతో విజయం సాధించారు.