ఢాకాలో జరుగుతున్న 11వ దక్షిణాసియా క్రీడల్లో (శాఫ్) భారత్ తన హవాను కొనసాగిస్తోంది. ఈ క్రీడల్లో 11వ రోజైన సోమవారం భారత్.. 21 స్వర్ణాలు, 13 రజతాలు, 7 క్యాంసాలతో మొత్తం 42 పతకాలు సాధించారు. ఇప్పటి వరకు 88 స్వర్ణాలు, 53 రజతాలు, 29 కాంస్యాలతో మొత్తం 170 పతకాలతో భారత్ ఉన్నత స్థానంలో కొనసాగుతోంది.
ఇదే టోర్నీలో బంగ్లాదేశ్ 96 పతకాలు (18 స్వర్ణాలు, 23 రజతాలు, 54 కాంస్యం), పాకిస్థాన్ 77 (18 స్వర్ణాలు, 25 రజతాలు, 34 కాంస్యాలు)లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నా యి. ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్కు నాలుగు స్వర్ణాలు దక్కాయి.
పురుషుల హైజంప్ విభాగంలో జాతీయ ఛాంపియన్ హరిశంకర్రాయ్ 2.16 మీటర్ల ఎత్తు లక్ష్యాన్ని చేధించి బంగారు పతకం సాధించగా, నిఖిల్ 2.13 మీటర్లతో రజతం గెలిచాడు. 100 మీటర్ల పురుషుల స్ప్రింట్లో భారత అథ్లెట్ అబ్దుల్ నజీబ్ (10.56 సె) రజతంతో సరిపెట్టుకున్నాడు. 4-400 రిలేలో భారత్కు చెందిన బిబిన్ మాథ్యూ, బిను, బినిష్, విబీలు 3:08.62 సెకన్లలో బంగారు పతకం గెలిచారు.
ఇక మహిళల 4-400 రిలేలోను భారత అథ్లెట్లు అశ్విని, థామస్ థినా, ప్రియాంక పవార్, జున్నా మున్నులు 3:38.62 సెకన్లలో లక్ష్యాన్ని చేధించి పసిడి పతకం సొంతం చేసుకున్నారు. మొత్తం ట్రాక్ అండ్ ఫీల్డ్లో మాత్రం భారత్ 10 స్వర్ణాలతో శ్రీలంక (7 స్వ)లను వెనక్కి నెట్టింది.
ఇదిలా ఉంటే.. టేబుల్ టెన్నిస్ పురుషుల, మహిళల జట్టు విభాగాల్లో భారత క్రీడాకారులు ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల బాక్సింగ్లో చోటే లాల్ (57 కేజీలు), సురంజయ్సింగ్ ( 51 కేజీలు), అమన్దీప్ సింగ్ (48 కేజీలు)లు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.