ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » వచ్చే సీజన్లో దేశానికి మరింత ఖ్యాతిని తీసుకొస్తా: అద్వానీ (Pankaj Advani, Billiards and Snooker Federation of India, England, Bangalore, Arvind Savur)
వచ్చే సీజన్లో దేశానికి మరింత ఖ్యాతిని తీసుకొస్తా: అద్వానీ
FILE
రాబోయే సీజన్లో ఉత్తమంగా రాణించి, దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించేందుకు కృషి చేస్తానని భారత బిలియర్డ్స్ స్టార్ పంకజ్ అద్వానీ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండు నెలల బ్రేక్ తరువాత.. మార్చి 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగనున్న "సిక్స్ రెడ్ నేషనల్ ఛాంపియన్షిప్"లో పంకజ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ.. తాజా సీజన్లో మరిన్ని విజయాలను సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు.
ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ అయిన అద్వానీ ప్రస్తుతం కోచ్ అరవింద్ సావూర్ శిక్షణలో 2010లో జరుగనున్న ఏషియన్ గేమ్స్కోసం కఠినంగా సాధన చేస్తున్నాడు. ఈ మెగా టోర్నీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు అతను వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు.
ఈలోగా మార్చి 7 నుంచి బెంగళూరులో జరుగనున్న సిక్స్ రెడ్ ఛాంప్స్లో మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటానని పంకజ్ వ్యాఖ్యానించాడు. చైనాలోని గువాంగ్ఝూలో జరుగనున్న ఏషియన్ గేమ్స్ సెలెక్షన్స్ ట్రయల్స్ అనంతరం జరుగనున్న ఈ టోర్నీలో అద్భుతంగా రాణించగలననే నమ్మకంతో ఉన్నట్లు చెప్పాడు.
ఈ సంవత్సరం మొత్తంమీదా చాలా టోర్నీలు జరుగనున్నాయనీ, అన్ని టోర్నీలలో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటానని పంకజ్ అన్నాడు. అంతేగాకుండా దేశానికి మరింత ఖ్యాతిని తీసుకొస్తానని పేర్కొన్నాడు. కాగా.. గత సంవత్సరం చెన్నైలో జరిగిన వీఐపీ మాట్రిక్స్ ఆలిండియా ఇంటర్నేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్లో పంకజ్ సెమీ ఫైనల్స్ వరకూ వెళ్లిన సంగతి పాఠకులకు తెలిసిందే.