దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో జరుగుతోన్న ప్రతిష్టాత్మక ప్రపంచకప్ హాకీలో పాకిస్థాన్ తొలి గెలుపును నమోదు చేసుకుంది. మంగళవారం స్పెయిన్తో జరిగిన హోరాహోరీ పోరులో పాకిస్థాన్ 2-1 తేడాతో విజయం సాధించింది. పూల్-బి మ్యాచ్లో పాక్ ఆటగాడు అబ్దుల్ హసీమ్ ఖాన్ రెండు గోల్స్ చేసి జట్టును గెలిపించాడు.
మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు గట్టిపోటీని ప్రదర్శించాయి. ఈ క్రమంలో పాకిస్థాన్కు 9వ నిముషంలోనే గోల్ చేసే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. రెండు జట్లు పరస్పరం గోల్స్ సాధించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పాటు ఇరు జట్ల రక్షణశ్రేణి బలంగా ఉండడంతో గోల్స్ లభించలేదు.
కానీ ఆటకు 30వ నిమిషంలో పాకిస్థాన్ హాకీ ఆటగాడు అబ్దుల్ హసీమ్ తొలి గోల్ సాధించాడు. దీంతో ప్రథమార్ధంలో పాక్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ద్వితీయార్ధంలోనూ ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి.
అయితే ఆటకు 67వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు డేవిడ్ అద్భుత గోల్తో స్కోరును సమం చేశాడు. దీంతో మ్యాచ్లో ఉత్కంఠ పెరిగింది. చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను అబ్దుల్ హసీమ్ రెండో గోల్గా మలచడంతో పాక్ విజయం సాధించింది. ఫలితంగా తొలి మ్యాచ్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్కు స్పెయిన్పై విజయం సాధించడం కాస్త ఊరట నిచ్చింది.
ఈ సందర్భంగా పాకిస్థాన్ కోచ్ షాహిద్ అలీఖాన్ మాట్లాడుతూ.. ఈ విజయం కీలక మలుపు కావాలని ఆశిస్తున్నామన్నారు. ఈ మ్యాచ్లో తమ వ్యూహాలన్నీ మంచి ఫలితాలను అందించాయని అలీఖాన్ చెప్పారు.