ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » "డేవిస్ కప్" వేదిక న్యూజిలాండ్కు మార్పు: ఐటీఎఫ్ (Davis Cup | International Tennis Federation | New Zealand | Security concerns | Pakistan)
పాకిస్థాన్లో జరగాల్సిన డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య న్యూజిలాండ్లో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ డేవిస్ కప్ టోర్నమెంట్ను న్యూజిలాండ్కు మార్పు చేస్తామని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) మంగళవారం వెల్లడించింది.
డేవిస్ కప్ ఆసియా-ఓషియానో గ్రూప్-2 టోర్నీని పాకిస్థాన్లో నిర్వహించేందుకు గతంలో ఐటీఎఫ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్లో చోటుచేసుకుంటున్న బాంబు పేలుళ్లు, కాల్పులు వంటి అవాంఛనీయ సంఘటనలతో విదేశీ ఆటగాళ్లు పాల్గొనే ఈ టోర్నీని పాకిస్థాన్లో నిర్వహించడం సరికాదని ఐటీఎఫ్ భావిస్తోంది.
ఇందులో భాగంగా, భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని డేవిస్ కప్ టోర్నమెంట్ను న్యూజిలాండ్కు తరలించింది. షెడ్యూల్ ప్రకారం కివీస్తో జూలైలో జరిగే ఈ డేవిస్ కప్ టోర్నమెంట్ న్యూజిలాండ్లోనే జరుగుతుందని ఐటీఎఫ్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. తమ దేశంలో నిర్వహించనున్న డేవిస్ కప్ ఆసియా-ఓషియానో గ్రూప్-2 టోర్నీని వేరే ప్రాంతానికి తరలించినట్లయితే చూస్తూ ఊరుకోబోమని పాకిస్థాన్ టెన్నిస్ ఫెడరేషన్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. జూలై 9 నుంచి 12వ తేదీ వరకు తమ దేశంలో జరుగనున్న ఈ టోర్నీ వేదికను మార్చేందుకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఎలాంటి ప్రయత్నం చేసినా ఊరుకునేది లేదని పీటీఎఫ్ స్పష్టం చేసింది.
ఈ విషయమై పీటీఎప్ ప్రెసిడెంట్ దిలావర్ అబ్బాస్ మాట్లాడుతూ.. భద్రతా కారణాలతో డేవిస్ కప్ వేదికను మార్పిడి చేస్తున్నట్లు ఐటీఎఫ్ ఓ లేఖ ద్వారా తెలియజేసిందన్నారు. అయితే ఈ టోర్నమెంట్ను స్వదేశంలోనే నిర్వహించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.