ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆర్చరీ వరల్డ్ కప్: భారత పురుషుల జట్టుకు స్వర్ణం! (Archery World Cup | Indian men's team | Gold | Jayanta Talukdar | Tarundeep Rai | Rahul Banerjee)
చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్లు తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఫైనల్ పోరులో భారత పురుషుల జట్టు జపాన్ను మట్టికరిపించి, స్వర్ణ పతకం సాధించింది. భారత ఆర్చర్లు జయంత తాలూక్దర్, తరుణ్దీప్ రాయ్, రాహుల్ బెనర్జీలు 224-220 పాయింట్లతేడాతో చిత్తు చేశారు.
జపాన్కు చెందిన రియోటా అమానొ, తకహరు ఫురుకవా, హిదేక్ కికుచ్చిల త్రయాన్ని భారత ఆర్చర్లు అధిగమించారు. ఫలితంగా ఈ టోర్నీలో భారత్ 57-54 పాయింట్ల తేడాతో పైచేయి సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్-జపాన్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. అయితే భారత పురుషుల జట్టు జపాన్ ఆర్చర్లపై ఆధిక్యం సాధించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఇకపోతే.. శుక్రవారం జరిగిన సెమీస్లో భారత ఆర్చర్లు జయంత తాలూక్దర్, తరుణ్దీప్ రాయ్, రాహుల్ బెనర్జీలు 222-214తో చైనాను చిత్తుచేశారు. గత ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్స్లో అమెరికా చేతిలో పరాజయం పాలైన భారత్ ఈ ప్రపంచకప్ క్వార్టర్స్లో అదే అమెరికాను ఖంగుతినిపించి సెమీస్కు చేరింది. ఈ క్రమంలో చైనానుకూడా చిత్తు చేసి ఫైనల్కు చేరింది. మరో సెమీఫైనల్లో జపాన్ 224-216తో ప్రపంచ చాంపియన్ కొరియాకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.