బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో భారత జట్టు వివిధ విభాగాల్లో మెరుగ్గా రాణించి పతకాలు సాధించగలదని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షుడు సురేష్ కల్మాడీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత జట్టు ప్రధానంగా బాక్సింగ్, టెన్నిస్, షూటింగ్ విభాగాల్లో రాణించగలదని అంచనా వేశారు.
భారత జట్టు 57 మంది సభ్యుల బృందం బీజింగ్కు వెళుతున్న సందర్భంగా కల్మాడీ వారికి న్యూఢిల్లీలో వీడ్కోలు పలికారు. ఇండియన్ ఎక్స్ప్రెస్గా పేర్గాంచిన మహేష్ భూపత, లియాండర్ పేస్ జోడీపై తాము ఎక్కువగా ఆశలు పెట్టుకున్నామని వివరించారు. పేస్తో భూపతి జోడీ కట్టడం తనకు ఆనందకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. జాతికోసం చేతులు కలిపిన పేస్-భూపతిలు విశ్వ క్రీడల్లో పతకంతో తిరిగి వస్తారని అన్నారు.
టెన్నిస్ మహిళల విభాగంలో సానియా మీర్జా, సునీతా రావులు కూడా మెరుగ్గా రాణించాలని కోరారు. వీరిద్దరూ ఒలింపిక్స్ ఊహించని విజయాలు నమోదుచేయాలని ఆకాంక్షించారు. షూటింగ్ జట్టుపై కూడా భారత్ ఆశలు పెట్టుకుందని కల్మాడీ వెల్లడించారు.
|