ప్రపంచం యావత్తూ ఉత్కంఠతతో ఎదురు చూచిన ఒలింపిక్- 2008 పోటీలకు కొద్దిసేపటి క్రితం తెరలేచింది. చైనా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఒలింపిక్-2008 పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైంది.
చైనా అధ్యక్షుడు హూ జింటావో చేతుల మీదుగా ప్రారంభమైన ఈ 29వ ఒలింపిక్ క్రీడల సంరంభం మరో 16రోజులపాటు క్రీడాభిమానులకు ఎనలేని ఆనందాన్ని, అంతులేని ఉల్లాసాన్ని కల్గించనున్నాయి.
అత్యంత సుందరంగా అలంకరించిన బీజింగ్లోని బర్డ్ నెస్ట్ సేడియంలో ప్రారంభమైన ఒలింపిక్ సంబరాల ప్రారంభాన్ని చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సంఖ్యాశాస్త్రంపై అత్యంత విశ్వాసాన్ని కల్గిన చైనా ఒలింపిక్ క్రీడలను 08.08.08 తేదీన రాత్రి 8గంటల 8 నిమిషాల 8 సెకన్లకు ప్రారంభించడం విశేషం.
రంగురంగుల విద్యుత్ దీపాల కాంతిలో మెరిసి పోతోన్న స్టేడియంలో చైనా సాంప్రదాయబద్ధ కార్యక్రమాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనేక వందలమంది ప్రదర్శనకారులు వివిధ రకాల ప్రదర్శనలతో ఆహుతులను ఆకట్టుకునేలా నర్తిస్తున్నారు. ఈ ప్రదర్శనలు మరో మూడున్నర గంటలపాటు కొనసాగనున్నాయి.
ప్రపంచంలోని 205 దేశాలకు చెందిన 10,708మంది క్రీడాకారులు ఒలింపిక్ పోటీల్లో పాల్గొననున్నారు. ప్రస్తుత ఒలింపిక్లో 28 క్రీడాంశాలకు సంబంధించి 328 ఈవెంట్స్లో క్రీడాకారులు పోటీ పడనున్నారు. బీజింగ్లో నిర్వహిస్తున్న ఈ ఒలింపిక్ పోటీలకు భద్రత కల్పించేందుకు చైనా దాదాపు లక్షమంది పోలీసులను నియమించింది.
|