చైనా రాజధాని బీజింగ్లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో భారత యువ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన సత్తాను చాటింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఈ స్టార్ ప్లేయర్ ప్రీ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ పోటీలో ఉక్రెయిన్కు చెందిన లారెసాపై 21-18, 21-10 స్కోరుతో విజయం సాధించింది. ఈ విజయంతో సైనా నెహ్వాల్ మూడో (ప్రీ క్వార్టర్) రౌండ్కు చేరుకుంది.
అంతకుముందు రష్యా క్రీడారిణి ఎల్లా కరాచ్కోవాతో జరిగిన తొలి రౌండ్ పోటీలో సైనా మంచి స్కోరుతో గెలుపొందిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్లో 21-9, 21-8 స్కోరుతో విజయం సాధించింది. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సైనా తన సర్వీస్లో మొత్తం 26 పాయింట్లను తన వశం చేసుకోవడం గమనార్హం. ప్రీ క్వార్టర్లో ప్రపంచ నంబర్ త్రీ, హాంకాంగ్ క్రీడాకారిణి చెన్ వాంగ్, స్లొవేకియా క్రీడాకారిణి ఎవా స్లాడెకోవాల మధ్య జరిగే పోటీ విజేతతో నెహ్వాల్ తలపడుతుంది.
|