బీజింగ్ ఒలింపిక్స్లో భారత్ తొలిసారిగా చరిత్ర సృష్టించింది. హాకీలో మాత్రమే ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించిన భారత్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం అన్న మాటే మరిచిపోయిన సమయంలో తొలిసారిగా ఆ ఆనందాన్ని బీజింగ్ ఒలింపిక్లో చవిచూచింది.
భారత క్రీడాకారుడు అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తొలిసారిగా స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. దీనితో షూటింగ్లో, ఒలింపిక్స్ వ్యక్తిగత క్రీడా విభాగంలో స్వర్ణ పతకాన్ని అందుకున్న తొలి భారత క్రీడాకారునిగా అభివన్ బింద్రా రికార్డు సృష్టించాడు.
ప్రిలిమినరీ రౌండ్లో 596 పాయింట్లు సాధించిన బింద్రా ఫైనల్లో అద్భుతంగా రాణించి స్వర్ణ పత కాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్ రౌండ్లో 104.5 పాయింట్లు సాధించిన బింద్రా మొత్తం 700.5 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఒలింపిక్స్లో భారత్కు వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన అభినవ్ బింద్రా కెరీర్ను పరిశీలిస్తే ఘనమైన చరిత్ర మనకు గోచరమవుతుంది. అతి పిన్న వయసులో కామన్వెల్త్ క్రీడల్లో షూటర్గా అడుగు పెట్టిన బింద్రా 1983 సెప్టెంబర్ 28న జన్మించాడు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చిన్ననాటి నుంచే షూటర్గా మంచి ప్రతిభ కనబర్చిన బింద్రా 1998లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 15 ఏళ్ల ప్రాయంలోనే పాల్గొన్న క్రీడాకారుడిగా పేరుగడించాడు. అటుపై 2001లో జరిగిన మునిచ్ ప్రపంచ కప్లో కాంస్య పతకాన్ని సాధించాడు. అలాగే 2002లో జరిగిన మాన్చెస్టర్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న బింద్రా ఎయిర్ రైఫిల్ పోటీల్లో గ్రూప్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు.
ఇదే పోటీల్లో వ్యక్తిగత విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. ఇక 2001లో వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న బింద్రా ఆరు స్వర్ణాలు గెల్చుకోవడం ద్వారా తన సత్తా చాటాడు. బింద్రా ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో అతనికి రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డునిచ్చి సత్కరించింది.
ఇక 2004లో జరిగిన ఏథేన్స్ ఒలింపిక్స్లో పాల్గొన్న బింద్రా పతకాన్ని సాధించడంలో విఫలమయ్యాడు. అయితే 2006 జులై 24న ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో బింద్రా స్వర్ణాన్ని సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. గతంలో 1962లో కర్ణి సింగ్ మాత్రమే ఈ ఘనత సాధించగా ఆ తర్వాత బింద్రా మాత్రమే ఈ ఫీట్ సాధించిన షూటర్గా చరిత్ర సృష్టించాడు.
|