బీజింగ్ ఒలింపిక్స్లో క్వార్టర్స్కు చేరడం ద్వారా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వ్యక్తిగత విభాగంలో షూటర్ అభినవ్ బింద్రా ఇప్పటికే భారత్కు స్వర్ణాన్ని అందించగా సైనా మరో పతకాన్ని అందించే అవకాశం ఉండడంతో అభిమానుల్లో ఆమెపై ఆసక్తి నెలకొంది. ఒలింపిక్స్లో క్వార్టర్స్కు చేరిన సైనా కెరీర్ను ఓసారి పరిశీలిస్తే...
రెండేళ్ల క్రితం 2006లో ఫిలిఫైన్స్ ఓపెన్ గెల్చుకోవడం ద్వార ఫోర్ స్టార్ బ్యాడ్మింటన్ ఈవెంట్ గెల్చుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనా ఖ్యాతి గడించింది. అలాగే జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణం గెల్చుకున్న 33వ క్రీడాకారిణిగా సైనా రికార్డు సృష్టించింది. దీంతోపాటు రెండుసార్లు జాతీయ మహిళా సింగిల్స్లో రన్నరప్గా నిలవడం ద్వారా సైనా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే చిత్రంగా ఈ రెండుసార్లూ ఫైనల్ పోరులో అపర్ణ పోపట్ చేతిలోనే సైనా పరాజయం చవిచూడడం విశేషం.
అలాగే ఆసియా శాటిలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రెండుసార్లు విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతోపాటు 2003లో సైనా జెకోస్లెవేకియాలో జరిగిన జూనియర్ ఓపెన్ టోర్నమెంట్ను గెల్చుకుంది. 2004లో ఆస్ట్రేలియాలో జరిగిన 2వ యూత్ కామన్వెల్త్ గేమ్స్లో సైనా రజత పతకాన్ని గెల్చుకుంది.
వీటితోపాటు 2004లో కెనడాలో జరిగిన జూనియర్ ప్రపంచ కప్ పోటీల్లో సైనా ఫ్రీ క్వార్టర్ ఫైనల్కు చేరింది. 2006లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకుంది. అలాగే 2006లో జరిగిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ అయిన చైనా క్రీడాకారిణి వాంగ్ హియాన్తో సైనా పోటీపడింది.
అయితే ఈ మ్యాచ్లో సైనా 13-21, 9-21 తేడాతో ఓడిపోయినా ప్రత్యర్ధికి గట్టి పోటీనిచ్చింది. అలాగే ఇటీవల జరిగిన సీనియర్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ గ్జీ గ్జింగ్ ప్యాన్గ్తో సైనా పోటీపడింది. ప్రస్తుతం హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కోచింగ్ తీసుకునంటోన్న సైనా నెహ్వాల్ గతంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎమ్. అరీఫ్ వద్ద కోచింగ్ తీసుకుంది. సైనా తల్లితండ్రులు సైతం గతంలో హర్యానా రాష్ట్ర క్రీడాకారులు కావడం విశేషం.
|