బీజింగ్ ఒలింపిక్స్లో భారత బాక్సర్ అఖిల్ కుమార్ పోరు ముగిసినట్టైంది. క్వార్టర్స్లోకి అడుగు పెట్టడం ద్వారా పతకంపై ఆశలు రేకెత్తించిన అఖిల్ ఆ ఆశలను వమ్ము చేస్తూ ఓటమి పాలయ్యాడు. దీంతో ఫైనల్కు చేరే అవకాశాన్ని అఖిల్ కుమార్ కోల్పోయాడు.
మాల్దోవా బాక్సర్ గోజన్వియా సెలెవ్తో సోమవారం జరిగిన క్వార్టర్స్ పోరులో అఖిల్ ఓటమి చవి చూశాడు. ప్రీ క్వార్టర్లో ప్రపంచ ఛాంపియన్ను ఖంగు తినిపించిన అఖిల్ క్వార్టర్స్లో చతికిలబడడం భారత అభిమానులను నిరాశ పరిచింది.
క్వార్టర్స్లో అఖిల్, గోజన్ మధ్య నాలుగు రౌండ్ల పోరు కొనసాగింది. ఇందులో తొలి రెండు రౌండ్లలో చెరో రెండు పాయింట్లతో అఖిల్, గోజన్లు సమాన ఆధిక్యం కనబరిచారు. అయితే మూడో రౌండ్లో తన ప్రతిభను ప్రదర్శించిన గోజన్ నాలుగు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మూడో రౌండ్ ముగిసే సరికి అఖిల్ 2-6 తేడాతో వెనకబడ్డాడు.
ఇక చివరిదైన నిర్ణయాత్మక రౌండ్లో అఖిల్ బాగా తడబడ్డాడు. అఖిల్ విసిరిన చాలా పంచ్లను చాక చక్యంగా తప్పించుకున్న గోజన్ తాను మాత్రం గురి తప్పకుండా అఖిల్పై పంచ్ల వర్షం కురిపించాడు. దీంతో నాలుగో రౌండ్ ముగిసే సరికి గోజన్ మరో నాలుగు పాయింట్లు సాధించాడు. నాలుగో రౌండ్లో అఖిల్ ఖాతాలో ఒక్క పాయింట్ మాత్రమే చేరింది.
దీంతో నాలుగు రౌండ్లు ముగిసే సరికి గోజన్ మొత్తం 10 పాయింట్లు సాధించగా అఖిల్ కేవలం మూడు పాయింట్లు మాత్రమే సాధించాడు. ఈ కారణంగా అఖిల్పై విజయం సాధించిన గోజన్ తర్వాతి రౌండ్కు చేరుకున్నాడు. ఇక భారత విషయానికొస్తే పతకం తెస్తాడనుకున్న అఖిల్ కుమార్ ఇలా క్వార్టర్స్లో వెనుతిరగడం అభిమానుల్లో పెను నిరాశను నింపింది.
|