బీజింగ్ ఒలింపిక్లో వ్యక్తిగత స్వర్ణం గెల్చుకోవడం ద్వారా భారత్కు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన అభినవ్ బింద్రాకు భారీ నజరానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం సోమవారం బింద్రాకు రూ. కోటిని బహూకరించింది.
ఛండీగడ్లోని ఓ హోటల్లో సోమవారం జరిగిన అభినందన సభలో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ చేతుల మీదుగా బింద్రాకు కోటిరూపాయల చెక్కును అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బింద్రా తల్లితండ్రులతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఒలింపిక్ చరిత్రలో భారత్ తరపున వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా బింద్రా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. షూటింగ్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణం గెల్చుకోవడం ద్వారా వ్యక్తిగత విభాగంలో భారత్ స్వర్ణం సాధించలేదు అన్న కొరతను బింద్రా తీర్చగలిగాడు.
బీజింగ్లో ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో భాగంగా గత 11న జరిగిన ఎయిర్ రైఫిల్ పోటీల్లో 23 సంవత్సరాల అభినవ్ బింద్రా పురుషుల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. రెండు సార్లు ఒలింపిక్ పోటీల్లో పాల్గొన్న ఈ ఢిల్లీ కుర్రాడు 700.5 పాయింట్లతో ఈ ఘనతను సాధించడం గమనార్హం.
|