బీజింగ్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత షూటర్ అభినవ్ బింద్రాకు లభిస్తున్న నజరానాల పరంపర కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం బింద్రాకు రూ. 50 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ నగదు బహుమతిని అర్జున అవార్డుల కార్యక్రమంలో బింద్రాకు అందించనున్నారు.
ఈ విషయమై క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన చేసింది. దీని ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో పతకాలు తెచ్చిన క్రీడాకారులకు ఈ నగదు బహుమతిని ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఇది వరకు ఇస్తున్న నగదు బహుమతి విలువను సైతం ఈ సందర్భంగా భారీగా పెంచారు.
కేంద్ర క్రీడల మంత్రి గిల్ చేసిన అభ్యర్థన ప్రకారం ఆర్థికశాఖ నగదు బహుమతుల విలువను పెంచింది. దీని ప్రకారం ఇదివరలో స్వర్ణ పతక విజేతకు ఇస్తున్న రూ. 20లక్షల స్థానంలో రూ. 50 లక్షలు అందించనున్నారు. అలాగే రజత పతక విజేతకు రూ. 18 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు. ఇక కాంస్య పతక విజేతకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 లక్షలకు నగదు బహుమానాన్ని పెంచారు.
|