సుడిగాలిలా పరిగెత్తడం ద్వారా గత శనివారం 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెల్చుకున్న జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్ 200 మీటర్ల పరుగులోనూ తన సత్తా చూపాడు. బీజింగ్లో బుధవారం జరిగిన 200 మీటర్ల స్ప్రింట్ను 19.30 సెకన్లలో గెల్చుకోవడం ద్వారా బోల్ట్ స్వర్ణాన్ని ఎగరేసుకుపోయాడు. అంతేకాదు ఈ విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సైతం బోల్ట్ సాధించాడు.
దీంతో ఒకే ఒలింపిక్లో 100, 200 మీటర్ల స్ప్రింట్లను గెల్చిన తొమ్మిదో అథ్లెట్గా బోల్ట్ మరో రికార్డు సంపాదించాడు. అంతకు ముందు శనివారం జరిగిన 100మీటర్ల పరుగులో సైతం బోల్ట్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విభాగంలో 9.69 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించడం ద్వారా బోల్ట్ స్వర్ణాన్ని గెలవడంతో పాటు ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు.
ఇందులో కొసమెరుపేమిటంటే బోల్ట్కు ముందు ఎనిమిది మంది అథ్లెట్లు ఇలా ఒకే ఒలింపిక్లో 100, 200 మీటర్ల స్ప్రింట్లలోనూ స్వర్ణాలను చేజిక్కించుకున్నా వారెవరు కూడా ప్రపంచ రికార్డును మాత్రం సాధించలేక పోయారు. అయితే బోల్ట్ మాత్రం రెండు విభాగాల్లోనూ స్వర్ణాలను సాధించడం మాత్రమే కాకుండా రెండు విభాగాల్లోనూ ప్రపంచ రికార్డు సృష్టించడం గమనార్హం.
|