బీజింగ్ ఒలింపిక్స్లో భారత్ తరపున పతకాలు సాధించిన వారితో పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు నగదు పురస్కారాల వెల్లువ ప్రారంభమైంది. బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా పతకాల బోణీ ప్రరాంభించిన అభినవ్ బింద్రాతో ప్రారంభమైన ఈ నగదు పురస్కారాల ప్రవాహం ప్రస్తుతం కాంస్యం సాధించిన సుశీల్ కుమార్ వరకు కొనసాగుతోంది.
బీజింగ్లో బుధవారం కాంస్యం గెల్చుకున్న సుశీల్ కుమార్కు రైల్వేశాఖ నగదు, పదోన్నతి బహుమతి అందించిన విషయం తెలిసిందే. అదే మార్గంలో కేంద్ర ప్రభుత్వం సైతం సుశీల్ కుమార్కు రూ. 25 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షలు, ఉక్కు శాఖ రూ. 25 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించాయి.
వీటితో బాటు సెయిల్ రూ. 15 లక్షలు, ఎన్ఎండీసీ రూ. ఐదు లక్షలు ప్రకటించాయి. మరి కొన్ని సంస్థలు సైతం సుశీల్ కుమార్కు నగదు పురస్కారాలను ప్రకటించాయి. కేవలం పతక వీరులకే కాక అద్భుత ఆటతీరుతో ఒలింపిక్స్లో క్వార్టర్స్ వరకు చేరుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు కూడా ప్రశంసలు నగదు పురస్కారాలు అందుతున్నాయి.
తాజాగా హర్యానా ప్రభుత్వం సైనాకు నగదు పురస్కారాన్ని ప్రకటించింది. సైనా ప్రతిభను ప్రశంసిస్తూ హర్యానా ప్రభుత్వం ఆమెకు రూ. 25 లక్షలు అందజేయనున్నట్టు ప్రకటించింది.
బీజింగ్ ఒలింపిక్లో ఇప్పటివరకు భారత క్రీడాకారులు రెండు వ్యక్తిగత పతకాలు సొంతం చేసుకోగా బాక్సింగ్లో మరో పతకం ఖాయమైంది. ఇలా ఒలింపిక్ చరిత్రలో భారత్కు మూడు వ్యక్తిగత పతకాలు రానుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
|