అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్లు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్లు ఇవ్వడానికి క్యాపిటల్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీయే) నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీయే త్రిసభ్య కమిటీ సమావేశంలో మొత్తం 4929 మందికి పింఛన్లను తిరిగి పునరుద్ధరించడానికి సమ్మతం తెలిపారు. అలాగే భూమిలేని పేదలకు కూడా పింఛను ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది.
త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు అర్హులైన వారికి నెలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వటానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. రాజధానికి భూసమీకరణ జరిగిన సమయంలో భూమి లేని పేదలకు ఉపాధికి ఇబ్బంది లేకుండా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో 4,929 మంది పేదలు పెన్షన్లు తీసుకునేవారు.
వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు నిలిపివేయటంతో పాటు.. పేదలకు పెన్షన్లు రద్దు చేసింది. ఇప్పుడు వారందరికీ పునరుద్దరించేందుకు సీఆర్డీఏ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల్లో పెన్షన్ దరఖాస్తులు ఇవ్వాలని కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామసభల సమయంలోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని కమిషనర్ కన్నబాబు తెలిపారు.