ఇద్దరు అనాథ పిల్లలకు తన జీతం నుంచి నెలకి రూ. 10,000 డిప్యూటీ సీఎం పవన్ సాయం
తను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలో వుంటున్న ఇద్దరు అనాథ పిల్లలు తమ వ్యధను నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓ వీడియో ద్వారా తెలియజేసారు. అందులో వారు చెబుతూ... పవన్ సార్, మాకు అమ్మానాన్న ఇద్దరూ లేరు. నాన్నగారు చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. అమ్మ ఇటీవలే కేన్సర్ వ్యాధితో చనిపోయారు. ఇక అప్పట్నుంచి నా తమ్ముడు, నేను ఎవరొకరి ఇంట్లో తలదాచుకుంటూ బ్రతుకుతున్నాము. మాకు ఇల్లు కూడా లేదు. మమ్మల్ని మీరే ఆదుకోవాలి సార్ అంటూ వీడియో ద్వారా విన్నవించుకున్నారు.
విషయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. తన జీతం నుంచి ప్రతి నెలా ఆ ఇద్దరు పిల్లలకి రూ. 10,000 ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే ఇల్లు మంజూరు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసారు. వారిద్దరికీ ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో చదువుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాగా ఇప్పటికే డిప్యూటీ సీఎం 42 మంది అనాథ చిన్నారుల బాధ్యతను తీసుకుని అన్నీ తానై మద్దతునిస్తున్నారు.