విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ - స్కూల్కు కంప్యూటర్ల వితరణ
ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో విద్యార్థులకు ఇచ్చిన మాటను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. తన సొంత నిధులతో పాఠశాలకు కంప్యూటర్లు, పుస్తకాలను పంపిణీ చేశారు. చిలకలూరిపేటలోని శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 25 కంప్యూటర్లు, అవసరమైన ఫర్నీచర్ను ఆయన సొంత నిధులతో అందించారు.
పవన్ కళ్యాణ్ తరపున పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ కృతిక శుక్ల, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తదితరులు పాఠశాల యాజమాన్యానికి కంప్యూటర్లు పుస్తకాలను అందచేశారు. ఈ నెల 5వ తేదీన జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ఆ పాఠశాలకు కంప్యూటర్లు, లైబ్రరీకి పుస్తకాలు, బీరువాలు ఇస్తానని మాట ఇచ్చారు. అలా మాట ఇచ్చిన 10 రోజులు తిరగకముందే పవన్ తన మాటను నిలబెట్టుకున్నారు. దీనిపై విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.