గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 30 జులై 2021 (21:35 IST)

తిరుపతి డిప్యూటీ మేయర్‌గా భూమన అభినయ్ రెడ్డి

తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా భూమన అభినయ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లలితా ప్రాంగణంలో శుక్రవారం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఎన్నికల పరిశీలకులుగా హాజరై డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రకియను తిరుపతి నగర పాలకసంస్థ కమీషనర్ గిరీషా సమక్షంలో జరిపించారు.
 
డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రకియకు 50 మంది  కార్పొరేటర్లతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి హాజరయ్యారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రకియను కలెక్టర్ ప్రారంభించగా మొదట కార్పొరేటర్ సి.కె.రేవతి, 4వ వార్డు కార్పొరేటర్ భూమన అభినయ్ రెడ్డి పేరును డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించగా,కార్పొరేటర్ దూది కుమారి అభినయ్ రెడ్డి పేరును బలపరచగా, అన్నా సంధ్యా యాదవ్, కార్పొరేటర్ పొన్నాల చంద్రా కూడా బలపరుస్తూ భూమన అభినయ్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.

ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ లాంఛనంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా భూమన అభినయ్ రెడ్డి ఎన్నికైనట్టు ప్రకటించి దృవీకరణ పత్రాన్ని అందించారు. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన భూమన అభినయ్ రెడ్డికి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్, అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, పూల బోకె అందించి అభినందనలు తెలియజేసారు.
 
గురువారమే భూమన అభినయ్ రెడ్డి జన్మదినం సందర్భంతోబాటు డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావడంతో భూమన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి భూమన అభినయ్ రెడ్డికి బొకేలతో, సాలువాలతో కేకులతో అభినందలు తెలియజేస్తూ లలితా ప్రాంగణంలో సందడి చేసారు. అతి పెద్ద కేకును తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషా సమక్షంలో కట్ చేసి అభినయ్ రెడ్డికి తినిపించి అభినందనలు తెలిపారు.

కార్పొరేటర్లకు విప్‌గా వ్యవహరించిన కార్పొరేటర్ ఎస్.కె.బాబు, ఆంజినేయులు బుద్ధ విగ్రహాన్ని అందించగా, కో.ఆప్సన్ సభ్యులు ఇమామ్ అభినయ్ రెడ్డి చేతికి రక్షా రేకను కట్టి అభినందనలు తెలియపరచగా, కార్పొరేటర్లందరూ ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. తండ్రి నుండి ఆశీర్వాదం తీసుకున్న భూమన అభినయ్ రెడ్డి తనకు కేటాయించిన చాంబర్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, కమిషనర్ గిరీష, మేయర్ డాక్టర్ శిరీషా,డిప్యూటీ మేయర్ ముద్రనారాయణల సమక్షంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య డిప్యూటీ మేయర్  గా భాధ్యతలు స్వీకరించారు.