నాతో పెట్టుకుంటే తోక కట్ చేస్తా..: విపక్ష నేతలకు చంద్రబాబు వార్నింగ్
విపక్ష నేతలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరిక చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం సహించబోనని హెచ్చరించారు.
విజయవాడలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఆనాడు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. తాను ఏపీకి వెన్నుపోటు పొడిచానని కొన్ని పత్రికల్లో ఫొటోలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇక ఎంతమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. 'రాష్ట్రంలో పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు సహా నూతన రాజధాని అమరావతి... ఇలా అన్నిటినీ అడ్డుకునే యత్నం చేస్తున్నారు. చివరకు కాపుల ఉద్యమంలో ప్రవేశించి దారుణంగా వ్యవహరించారు. అయినా నా ముందు ఆటలు సాగవు. ఎవరైనా సరే తోక జాడిస్తే కట్ చేస్తా అని హెచ్చరించారు.
యుద్ధ విమానంలో హైదరాబాదుకు విభజన బిల్లు తెచ్చారు. పార్లమెంట్ తలుపులు మూసి టీవీలు ఆపేసి దారుణంగా విభజన చేశారు. ఇవన్నీ మరోసారి గుర్తు చేసుకుని కసిగా పనిచేయాలన్న పట్టుదల ప్రజల్లో రావాలనే మరోమారు చెబుతున్నా. ఆనాడు వైసీపీ కపట నాటకాలాడింది. అప్పటివరకు జైల్లో ఉన్న జగన్... విభజన బిల్లు రాగానే బయటకు వచ్చారని ఆరోపించారు.