శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (09:39 IST)

పెళ్లి ఫిక్స్.. వరుడు కాదు పొమ్మన్నాడు.. అమెరికాలో చిత్తూరు అమ్మాయి ఆత్మహత్య

అమెరికాలో చిత్తూరు అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంకా ఆమెకు పెళ్లి జరగాల్సి వుంది. ఇంతలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన సుష్మా అనే యువతి అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం 3 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కుమారుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురై అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. 
 
చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది. పూతలపట్టు మండలం బందార్ల పల్లె గ్రామానికి చెందిన మురళి కుమారుడు భరత్ అనే యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వారిద్దరి కుటుంబసభ్యులు చర్చించుకుని పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. పెద్దలు ఈ నెల 3వ తేదీన ఉదయం 3 గంటలకు వివాహం ఖాయం చేశారు. శుభలేఖలు కూడా ముద్రించారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. 
 
కానీ వారం రోజుల క్రితం యువకుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయంపై సుష్మ, భరత్ మధ్య పంచాయతీ జరిగింది. ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలిసింది. అయితే అంతా సర్దుకుంటారని అనుకున్నారు. కానీ చివరకు తన కుమార్తె మృతి చెందిందని వచ్చిన వార్తతో అవాక్కయ్యారు.
 
పెళ్లికి భరత్ నిరాకరించడంతోనే సుష్మా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుభలేఖలు ముద్రించి పెళ్లి రోజున ఇలాంటి ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం తమను కలచివేసిందని వాపోయారు. తమకు న్యాయం చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.